నా 'ఎవరు?' నవలపై 'చతుర'లో బహుమతి పొందిన సమీక్షలు

ఈ సమీక్షలను నా పాత బ్లాగులో మీరు ఇదివరకే చూసివుండవచ్చు. కొత్తవారికోసం నా ఈ కొత్త బ్లాగులో మళ్ళీ ఇస్తున్నాను.
'ఎవరు?' నవల: ఈ నవల ఆద్యంతమూ మెటా ఫిక్షనే. మన తెలుగు లో ఇలాంటి టెక్నిక్ తో రచనలు చాలా అరుదు.
నా నవలకి లంకె http://www.geocities.com/sarath.films/Evaru.pdf
Metafiction is a type of fiction that self-consciously addresses the devices of fiction. It can be compared to presentational theatre, which does not let the audience forget they are viewing a play; metafiction does not let the reader forget he or she is reading a fictional work.
For further information on Meta Fiction please click the following link: http://en.wikipedia.org/wiki/Metafiction
నవల వీడియో పరిచయం: http://www.youtube.com/watch?v=mp--ib4XR8w
ఫిబ్రవరి 2006 'చతుర' నవల 'ఎవరు?' పై సమీక్షలు
(ఏప్రిల్ 2006 'చతుర'సంచికలో ప్రచురింపబడినవి)

మొదటి బహుమతి పొందిన సమీక్ష - జె.వి రమణ, మణుగూరు
మేల్కొనవలసిన సమయం
పాశ్చాత్య సంస్కృతి విష ప్రభావం హాలాహలంలా విజృంభించి భరత ఖండమంతా కమ్ముకుని కకావికలం చేస్తున్న తరుణంలో ప్రవాసాంధృనిచే సంధించబడిన అస్త్రానికి బాసటగా నిలచిన 'చతుర'కు అభినందనలు.రక్తపు గ్రూపులకు చెందిన సమాచారాన్ని యువతరం తమ మనస్తత్వానికి, అభిరుచులకు తగ్గవారిని ఎన్నుకోవడానికి ఉపయోగించుకొని శాంతి సౌభాగ్యాలు పెంపొందించుకోవాలి. నేటికాలంలో వెర్రితలలు వేస్తున్న విశృంఖలత వల్ల అక్రమసంబంధాలు, అక్రమ సంతానం, భ్రూణ హత్యలు, ఎయిడ్స్ వంటి భయంకర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఉన్నతమయిన మన భారతీయ సంస్కృతిని నిర్వీర్యపరచడానికి పాశ్చాత్య దేశాల దాడికి అంకురమే ఈ విశృంఖలత. ఒక దానినుండి మరొకటి సమస్యలు ఉద్భవించి విశ్వరూపం దాల్చాయి. ఈ సమస్యలను అదుపుచేయడానికి ఒక సాధనంగా రక్తపు గ్రూపులకు చెందిన విజ్ణానాన్ని మలచుకోవాలి. మార్గం తప్పిన వారిని దారికి తేవడానికి దాని భయకర కోణాన్ని అవిష్కరించడమే సరి అయిన పని. ఇందుకోసం రచయిత అనేక పాత్రల ద్వారా మానవ సంబంధాల లోని వివిధ కోణాలను సృజించి అక్రమ సంబంధాల పర్యవసానాలను చక్కగా వివరించారు. నిజాలు తెలుసుకోకముందే అపోహలతో బాధపడిన లక్ష్య, మదాలసలే గాక రమణి, గురు, రాజేష్,హొయసల పాత్రలలో కూడా మార్పు తీసుకొచ్చినట్లు చూపితే ఇంకా బాగుండేది.శేషాచలం పాత్ర చెప్పినట్లు ప్రభుత్వం ప్రజలలో నైతిక విలువలు పెరిగేటట్లుగా చర్యలు తీసుకోవడం, పెనుభూతంగా మారుతున్న ఎయిడ్స్ వ్యాధి గురించి జనాన్ని జాగృతం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి సమస్య భయంకర రూపం సంతరించుకొనకముందే మేలుకొనవలసిన అవసరాని ఈ నవల నొక్కి చెపుతోంది.

రెండవ బహుమతి పొందిన సమీక్ష - ముద్దంశెట్టి అండమ్మ, చిలకలూరిపేట
ప్రయోగాత్మకం
ఎవరు? నవల లంకెఈమధ్యకాలంలో వచ్చిన నవలలన్నింటిలోనూ 'ఎవరు?' ప్రత్యేకమయినది, ప్రయోగాత్మకమయినది. ఇటువంటి సబ్జెక్ట్ నిజంగా సంచలనాత్మకమయినదే! సాధారణంగా ఎవరూ ఇలాంటి సాహసానికి ఒడిగట్టరు. కానీ రచయిత శరత్ ఎన్నుకున్న కమర్షియల్ టెక్నిక్ నవల ఆద్యంతమూ చదివిస్తుంది. నవలలో 'రక్త విశ్లేషణ'లు గమ్మత్తుగా వున్నాయి. చాలామంది చదువరులు కూడా ఒకింత ఆలోచనకు గురికాక తప్పదేమో! ఎందుకంటే బ్లడ్ గ్రూపులను గురించి వివరణాత్మకమైన వ్యాసం కూడా నవలతోపాటు ఇవ్వదం సంచలనమేకాదు, సాహసం కూడా. అయితే నవలలో వచ్చిన చాలా పాత్రలు కథ కనుగనంగా ఇమిడిపోయాయేకానీ గొప్పగా గుర్తుండిపోయే విధంగా పాత్ర చిత్రణ జరగకపోవడం రవ్వంత లోపం. సాధ్యాసాధ్యాలు పక్కకు పెడితే నిజజీవితం లోని మనుషులు, వారి మనస్తత్వాలు ఎంత విచిత్రంగా మారిపోతున్నాయో చిత్రిస్తూ కొన్ని పాత్రలను మలిచిన తీరుకు శరత్ అభినందనీయులు.సాక్షాత్తూ ముఖ్యమంత్రులు, మంత్రివర్గ సహచరులు, ప్రముఖులు, గృహిణులు, మధ్యతరగతి వారు, అభ్యుదయ మహిళల మీద విసిరిన సున్నితమయిన సెటైర్లు ఈమధ్య కాలంలో ఏ నవలలోనూ ఇంతగా కనిపించలేదు. ప్రజలూ, ప్రభుత్వాలూ ఎప్పుడూ అనవసర విషయాలకే ప్రాధాన్యతనిస్తారన్నది నగ్నసత్యం. రచయిత సత్యశ్రీ పాత్ర కూడా అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇక ప్రస్తుత సమాజం లోని 'అక్రమ సంబంధాల భాగోతం' పై ఎక్కుపెట్టిన ఈ 'ఎవరు' బాణం చాలా తక్కువ పేజీలలో రావడం బాగా లేదు. నవల ముగింపు కూడా వేగంగా, అనుకోకుండా, అర్ధాంతరంగా ముగించినట్లనిపించింది. ఆఖరుగా 'ఎయిడ్స్' వైపు పాఠకుల దృష్టి మళ్ళించి ' తస్మాత్ జాగ్రత్త' అన్న రచయిత అభినందనీయుడు.నాకు నచ్చిన సమీక్ష ఇది.
(సమీక్ష అంటే ఇలా వుండాలి. రచయిత గొప్పదనాన్ని, లోపాలని ఎత్తిచూపగలగాలి. ఇక్కడ వెలిబుచ్చిన ప్రశంసతోనూ, విమర్శతోనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. - శరత్)

మూడవ బహుమతి పొందిన సమీక్ష - లక్ష్మి, మిర్యాలగూడ
ఆరోగ్యకరమయిన ఇతివృత్తం ఉండాలి
ఎయిడ్స్(నవల) కు సరైన గుర్తింపు రాలేదన్న అక్కసుతో 'ఎవరు?' అనే సంచలనన్ని సృష్టించి, ఆ విధంగా ఎయిడ్స్ నిర్మూలనకు పరోక్షంగా కృషిచేసారు నవలలోని రచయిత సత్యశ్రీ. బ్లడ్ గ్రూప్ కాంబినేషను కారణంగానైనా అక్రమ సంబంధాలు మానుకుని రుజువర్తనను అలవరచుకుంటారని రచయిత ఆకాంక్ష. కానీ ఇది సరి అయిన మార్గం కాదు. సమాజానికి మార్గ నిర్దేశనం చేయాల్సిన వారు మానసిక పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేయాలే కానీ ఘాటైన డోసిచ్చి వికటించే పరిస్థితి తీసుకురాకూడదు. ఇలాంటి అపరిపక్వ పరిశోధనల వల్ల ఎప్పుడో జరగబోయే నష్టం సంగతేమో గానీ ఇప్పుడు మాత్రం ఆసక్తి పెరుగుతుంది. అనుమానాల బీజాలు మొలకెత్తి తల్లితండ్రుల బ్లడ్ గ్రూపులను వెతుక్కుంటూ, అనుకోని నిజాలు బయటపడటంతో లక్ష్య, మదాలస లాంటి ఎదిగీ ఎదగని మనస్సులు ఎంత తల్లడిల్లిపోతాయో గమనించాలి. ఏ చిన్న తేడాలు వచ్చినా అలాంటివారు అభద్రతకు లోనవుతారు.ఏ విషయం లోనయినా వాస్తవిక దృక్పథంతో అడుగు ముందుకేసినప్పుడే సమాజంలో్ నీతి, నిజాయితీ కల్గిన నాణ్యమయిన బీజాలు మొలకెత్తుతాయి. ముఖ్యమంత్రి అంతటి పెద్ద మనిషే తన సంతానం బ్లడ్ గ్రూపుల గురించి ఎందుకు ఆరా తీసినట్లు? అనుమాన బీజం మొలకెత్తబట్టే కదా్. భార్యాభర్తల మధ్య నమ్మకం వుండాలి. ఎయిడ్స్ వ్యాధి ప్రబలటానికి చదువు సంస్కారం ఉన్న పెద్ద కుటుంబాలు కూడా దోహదపడుతున్నాయనటంలో సందేహించాల్సిన పని లేదు. సిద్దాంత పరంగా రుజువుకాని అసంపూర్తి పరిశోధనలు ప్రజల్లో ప్రవేశపెట్టడం తగదు. ప్రేమానుబంధంతో అల్లుకుపోవాల్సిన హృదయాలు, రెండు కుటుంబాల మధ్య అవగాహనతో పెనవేసుకుపోవాల్సిన పెళ్ళి సంబంధాలు బ్లడ్ గ్రూపుల పేరుతో నిర్ణయించుకోవాలనుకోవడం, ఇంతకన్న దుర్భర జీవితం ఏముంటుంది? సంచలనం సృష్టించి సమాజంలో చలనం తీసుకురావడానికి ఆరోగ్యకరమయిన ఇతివృత్తం ఎంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

నాలుగవ బహుమతి పొందిన సమీక్ష - వి. లలితాంబ, పర్లాకిమిడి
సెన్సేషనల్ నవల
మనిషి మనస్సు సహజంగా కుతూహలజనకం. ఏది 'గుప్త'మో దాన్నేతెలుసుకోవాలనుకుంటుంది. రక్తపు రకాల వల్ల మనుషుల మనస్సులను మధించడం, ఆ మధనం తమ సంతానం సక్రమమా, అక్రమమా అన్న అతర్మధనంగా మారటం, భర్తలకు భార్యల మీద, భార్యలకు భర్తల మీద, అనుమానాలు వగైరా ఆంశాలతో కూడిన కథావస్తువుతో ఊపిరి సలపకుండా చదివించగల సెంసేషనల్ నవల రాసిన రచయిత శరత్ అభినందనీయులు. ఇంచుమించుగా ఎనిమిది జతలతో, ప్రతి జతకీ ఏదో ఒక అసంబద్ధమయిన రక్త రకమున్న సంతానాన్ని ఇరికించి 'ఎవరు' నవలను సాగించారు. మన దేశం లో శాస్త్ర విషయాలు చాలామందికి తెలియవు. తెలిసిన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మేనరికాలతో మందబుద్ధి సంతానం పుట్టుకొస్తున్నా, ఆర్. హెచ్. సరిపోక, తల్లే బిడ్డకి పాలివ్వడానికి అనర్హురాలయినా, ఈ వివాహాలు తగ్గటం లేదు. రాశి, ఆంశ, లగ్నం, నక్షత్రం, శాఖ, గోత్రం, చూస్తారే కానీ బ్లడ్ గ్రూప్, ఆర్. హెచ్. అంశం సరిచేసి చూసుకోరు. ఇవి సరిచేసుకోవడం, వివాహం ఏ తంతుతో జరిగినా రిజిస్టర్ చేసుకోవడం, ముందు ముందు అవిర్భనించనున్నాయి. శేషాచలం ప్రతి ఒక్కరికి వాత పెడుతూ, అసలు వస్తువుల నుంచి ఎయిడ్స్ మీదికి మళ్ళించి, తను మట్టుకు ఎవరికీ పట్టుబడకుండా చాకచక్యంగా తప్పుకోవడంతో ముగింపు చాలా బాగుంది.

ఐదవ బహుమతి పొందిన సమీక్ష - నరసింహప్రసాద్, పి వి ఎల్., కరీంనగర్
సమాజానిదే బాధ్యత
రచయితల నుండి సమాజం ఆశించేది వాస్తవాలనా లేక సామాజిక బాధ్యతనా? నగ్న సత్యాలనా లేక నాగరికులు మెచ్చే రచనలనా? అనాదిగా ఎడతెగకుండా నడుస్తున్న ఈ చర్చకు శరత్ గారి 'ఎవరు' నవల మరో సారి తెర తీసింది. ఈ నవల విభిన్న కథల సమాహారం. నవల ఆద్యంతం ఎవరు నవలపై ఆంధ్ర రాష్ట్రం లో కలుగుతున్న సంచలనం దానికి రచయిత ప్రతిస్పందన మాత్రమే ఏకసూత్రం. మిగతా భాగమంతా వేరు వేరు కుటుంబాలల్లో ఈ నవల కలిగించిన సంక్షోభం, సంభ్రమాల ప్రహసనమే. ప్రతి సంఘం కొన్ని విలువల పునాదిగా మనుగడ సాగిస్తుంటుంది. అలాంటి విలువల్ని ఒక రచయితో, ఒక ఉద్యమకారుడో వచ్చి కూలదోసి తమదైన శైలిలో నూతన సమాజాన్ని అవిష్కరిస్తారు. ఆ ప్రయత్నాలకు ఎల్లప్పుడూ అనుకూల, ప్రతికూల స్పందనలు ఎదురవుతుంటాయి. ఏది మంచి, ఏది చెడు అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాల్సిన బాధ్యత సమాజానిదే కానీ సాహితీ విమర్శకులది కాదు. విజ్ఞాన శాస్త్ర వాస్తవాలను ఆధారం చేసుకొని రూపుదిద్దిన 'ఎవరు' నవల మరలా అలాంటి ప్రశ్ననే లేవనెత్తి వాదోపవాదాలకి ఆరంభం పలికింది.

3 comments:

  1. సమీక్షలు సరే ... మరి నవల ఎక్కడ?

    ReplyDelete
  2. @ చైతన్య
    టపా పై భాగంలోనే లింక్ ఇచ్చానండీ.

    ReplyDelete